Saturday, September 7, 2013

హరికథ ఎలా ఉండాలి?

హరికథ స్వరూప, స్వభావలెలా ఉండాలో వివరిస్తూ నారాయణ దాసుగారు ఆంధ్ర పత్రిక 1911 ఉగాది ప్రత్యెక సంచికలో హరికథ అనే వ్యాసం వ్రాసారు. అందులోనిది ఈ పద్యం:   
ఘన శంఖమో యన గంఠంబు పూరించి
మేలుగ శ్రుతిలోన మేళవించి
నియమము తప్పక నయ ఘనంబుల బెక్కు
రాగ భేదంబుల రక్తి గొల్పి
బంతు లెగిర్చిన పగిది కాలజ్ఞతన్
జాతి మూర్చన లొప్ప స్వరము పాడి
చక్కని నృత్యము సర్వరసాను కూ
లంబుగాగ నభినయంబు చేసి
స్వకృత మృదు యక్షగాన ప్రబంధసరణి
వివిధ దేశంబులం బిన్నపెద్దలు గల
పలు సభల హరిభక్తి నుపన్యసింప
లేని సంగీత కవితాభి మాన మేల

అసాధ్య / సంగీత అష్టావధానం

నారాయణ దాసుగారు తన పంథొమ్మిదవ ఏట హరికధా ప్రదర్సనలతో సమాంతరంగా అవధాన ప్రక్రియ ప్రదర్సన కూడా మొదలు పెట్టారు. అయితే అయన అష్టావధానాలు తక్కిన వారి అష్టావధానాలకు భిన్నంగాఅయన సంగీత సాహిత్య ప్రతిభకుబహుభాషా పాండిత్యానికి దర్పణాలుగా ఉండేవి.  ఉదాహరణకుఅయన అష్టావధానాలలో వ్యస్తాక్షరి గ్రీకు భాషలో ఉండేది. 

నారాయణ దాసుగారు బందరులో పంతులుగారి మేడమీద ప్రదర్శించిన అష్టావధానం ప్రవేశ రుసుముతో జరిగింది.  అష్టావధానం 1888-89 లో వారు కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, బందరులలో సాగించిన సాహిత్య యాత్రలో భాగంగా ప్రదర్శించారు. సంగీతానికి సంబంధించిన అంశాలు అందులో ఉండడం దాని ప్రత్యేకత.  రెండు పాదములతో రెండు తాళములురెండు చేతులతో రెండు తాళములు వేసి పల్లవి పాడుచూ కోరిన జాగాకు ముక్తాయిలు వేయుటనలుగురకు తెలుగుననలుగురకు సంస్కృతమున కోరిన పద్యములు కవిత్వము చెప్పుటవ్యస్తాక్షరిన్యస్తాక్షరిగణిత శాస్త్ర సమస్యను సాధించుటపూలుగంటలు లెక్కించుటఛందస్సంభాషణఇంగ్లీషులో ఉపన్యాసము మొదలైనవిఆ అష్టావధానంలో అంశాలు. 

శ్రీ పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత దాసుగారు యక్షగాన రూపంలో రచించిన “నారాయణ దాస జీవిత చరిత్ర” లో నారాయణ దాసుగారి సంగీత / అసాధ్య అష్టావధానాన్ని ఈ విధంగా వర్ణించారు:

ఇరు హస్తములతోడ జెరియోక తాళంబు
చరణద్వయాన నేమరక రెండు
పచరించి, పల్లవిబాడుచు గోరిన
జాగాకు ముక్తాయి సరిగా నిడుట
నయమొప్ప న్యస్తాక్షరియును వ్యస్తాక్షరి
ఆంగ్లంబులో నుపన్యాస, మవల
నల్వురకున్ దెల్గునన్ నల్వురకు సంస్కృ
తంబున వలయు వృత్తాల గైత,
సంశయాంశంమ్ము శేముషీ శక్తితో బ
రిష్కరించుట, గంటలు లెక్కగొంట
మరియు ఛందస్సుతోడి సంభాషణంబు
వెలయు నష్టావధానంబు సలిపె నతడు

[నారాయణ దాసు గారు అష్టావధానం చేసిన మరునాడు, బుధవిదేయిని అనే స్థానిక పత్రిక ఆ అవధానం గురించి వ్యంగ్యంగా బ్రహ్మశ్రీ ఆదిభట్ల నారాయణ దాసుగారు చిన్నపనులగుంపు చేసేరు అని వ్రాసింది. నారాయణ దాసుగారు దానికి  తీవ్రంగా  స్పందిస్తూ, ‘కలుషహారిణి అనే ఇంకొక స్థానిక పత్రికలో ఇలా ప్రకటన ఇచ్చారు: నారాయణ దాసుగారు చేసినది అసాధ్య అష్టావధానముసంగీత సాహిత్యములలో ఇట్లవధానములు చేయు సమర్ధత ఇంకోక్కనికుండుట దుర్ఘటమని ఏల వ్రాయకూడదునా అష్టావధానము గ్రహించి వ్రాయుటకు కేవల సాహిత్యజ్ఞుడగు బుధవిదేయిని ప్రకటనకర్త సమర్ధుడు కాదు; పైగా నా ప్రతికక్షులలో చేరియుండుటచే అట్లు వ్రాసెను.” ఆ ప్రకటనతో బుధవిదేయిని’, కలుషహారిణి పత్రికల మధ్య పెద్ద వివాదమే చెలరేగింది. నారాయణ దాసుగారి సమర్ధకులుప్రత్యర్ధులు ఇరువైపులనుండి వ్యాసపరంపరలతో పోట్లాడుకున్నారు. చిలికి చిలికి గాలివాన అయినట్లే ఒక పెద్ద సాహిత్య దుమారమే చెలరేగింది.

ఈలోగాఅంతకుముందు పల్లవి ప్రదర్శనలో పరాజితులైన దాసుగారి ప్రతికక్షులు సంగీతంలో ఆయనను ఓడించాలనే ఉద్దేశంతో ఒక సభ చేసి,చేతనయితే అందులో వారితో పోటీకి రావాల్సిందిగా వర్తమానం పంపేరు. నారాయణ దాసుగారు ఆ సవాలును స్వీకరించి ఆ సభకు హజరయ్యారు.  అయన హుందాగా సభలో ప్రవేసించినంతనే బ్రావో’ అనే హర్షధ్వానాలు మిన్నుముట్టేయి. ఆ సభకు అధ్యక్షత వహించిన నారాయణ దాసుగారి ప్రత్యర్ధి (ఒక వకీలు), “నారాయణ దాసుగారు ఇక్కడ ఉన్న ఇరవై మంది సంగీత విద్వాంసులు విద్యయందు తమకు చాలరని ప్రకటించినందుకే ఈ పోటీ సభ నిర్వహించబడింది. కనుక వీరు వేయు ప్రశ్నలకతను సమాధానము చెప్పవలెను. ఈ శాస్త్ర పరీక్షలో అతను నెగ్గినచొ అతడందరికన్నా గొప్ప సంగీత విద్వాంసుడని అంగీకరించబడును. లేనిచో అతడు అందరికి క్షమాపణ చెప్పవలెను అన్నారు .అప్పుడు నారాయణ దాసుగారు లేచి సభికులారాఈ విద్వాంసులందరూ సంగీతమున నాకు లోకువయని వీరలు నన్ను తిరస్కరించినపుడెల్ల నేనన్నమాట నిజమే. సంగీత విద్వాంసులమనుకొన్నవారిలోనే సంగీత తత్వము తెలిసినవారుంట అరుదన తక్కినవారి గురించి చెప్పనేలకావున మాకు మధ్యస్థులై మీరు ఉండుట అసాధ్యము. ఇప్పుడు వీరు సంగీత శాస్త్రమున నన్ను పరీక్షించుటకు అనర్హులు. కారణమేమన సంస్కృతభాష కొంచెమైనను వీరికి తెలిసినట్లు కాన్పించదు. సంస్కృత భాషాజ్ఞాన మిసుమంతయులేని వారికి సంస్కృతమున వ్రాయబడిన సంగీత శాస్త్రమన్వయింప బడదు కదాకావున సంగీత శాస్త్రములోని సూత్రములు కాని పద్యములు కాని నేను చదివితే వీరికి అర్ధమే కాదు. కనుక శాస్త్ర చర్చ నాతొ చేయుటకు వీరు తగరని స్పష్టము.  ఇక శ్రోతృరంజక స్వరసందర్భము సంగీతము. కనుక వీరందరును కలిసి ఒక గంట పాడనిండు. పిదప నేను ఒక గంట పాడెదను. ఎవరి పాట మిక్కిలి రంజకముగా ఉండునని మీకు తోచునో వారధికులుగ నిర్ణయింపబడుడురు. ఇది నా మనవి అన్నారు. అప్పుడు సభాధ్యక్షులు లేచి, ఉభయుల వాదనలు విన్నాము. శాస్త్ర వాదమగునప్పుడు తగువు తీర్చుటకు మేమనర్హులము. ఉభయ కక్షల వారు పాడి సభారంజకమొనర్చుట మా కోరిక అన్నారు. అందుకా ప్రతికక్షులు మీ అందరికి రక్తి చేయుటకు ఈ సభ నిర్వహించబడలేదు అని ఇంకా వారి అక్కసు అంతా వెళ్ళగక్కేరు. దానికి నారాయణ దాసు గారి శిష్యుడొకడు దీటైన సమాధానం ఇచ్చేడు. రణగొణధ్వనుల మధ్య సభ ముగిసింది.  

బందురులో నారాయణ దాసుగారి ప్రతికక్షులలో ముఖ్యుడు హరి నాగభూషణం గారనే సంగీత విద్వాంసుడు. నారాయణ దాసుగారి పత్రికా ప్రకటనకు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసి వ్యాస పరంపరల యుద్ధం మొదలు పెట్టింది ఆయనే. ఇంత జరుగుతున్నా నారాయణ దాసుగారు అందులో జోక్యం చేసుకోలేదు. అలా కొన్ని నెలలు సాగిన యుద్ధం చివరకు చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారి జోక్యంతో ముగిసింది. నాగభూషణం గారు ఉపసంహారం అనే పేర బుధవిదేయిని పత్రికలో వ్రాసిన వ్యాసంతో డొంకతిరుగుడుగా క్షమాపణ చెప్పారు.  బుధవిదేయిని పత్రిక సంపాదకులు పురుషోత్తమ రావు గారు తమ కుమారుని నారాయణ దాసు గారింటికి పంపారు. ఆ అబ్బాయి నారాయణ దాసుగారిని కలిసి'మా నాన్నగారు నమస్కారాలు తెలపమన్నారుఅని తెలిపాడు. ఆ కధ అంతటితో సుఖాంతం అయింది. అయితే దానికి కొసమెరుపు లేక పోలేదు. అప్పటికి కొన్ని దశాబ్దాల తరువాత అంటే 1932 లొ బందరు పట్టణంలో హరి నాగభూషణం గారే అధ్యక్షత వహించిన సంగీత విద్వాంస సభలో నారాయణ దాసుగారి స్వరాక్షర కృతులను ఆచార్య పి. సాంబమూర్తి ప్రభ్రుతులు ఎంతో కొనియాడారు. ఆచార్య సాంబమూర్తిగారు 15-9-1932 న వ్రాసిన లేఖను బట్టి దాసుగారు 1927 లో మదరాసులో జరిగిన అఖిల భారత సంగీత పరిషత్తు ప్రారంభోత్సవ సభలో కొన్ని లోకోత్తరములైన స్వరాక్షర కృతులను గానం చేసినట్లు తెలుస్తున్నది.]  

Saturday, May 25, 2013

బెంగుళూరు నగర వర్ణన


నారాయణ దాసు గారు వారి సంగీత సాహిత్య జైత్రయాత్రలో దర్శించిన అనేక ప్రదేశాలను, కలసిన వ్యక్తులను పొందిన అనుభూతులను వర్ణిస్తూ రచించిన పద్యాలను మేలు బంతి అనే గ్రంధంలో ప్రచురించారు. ఈక్రింద ఇచ్చిన బెంగుళూరు నగర వర్ణన, మైసూరు మహారాజు జయచామరాజేంద్ర వడయార్ - 10 (1863 - 1894), బెంగుళూరు దర్బారులో ఆశువుగా రచించినది. ఆ పద్యం ఎంతో బాగుందని వ్రాతప్రతిని అడిగి తీసుకుని భద్రపరుచుకున్నరుట మహారాజా వారు.

అలరుతేనియ లూరు దలిరులజిగి మీరు
          విన్నగరువుదీరు బెంగుళూరు
చిరుత మబ్బులకారు చెమటరాని షికారు
          వేడుకలింపారు బెంగుళూరు
చెరకు తీయనినీరు చేలపచ్చనిబారు
          వేల్పునగరుగేరు బెంగుళూరు
ఆవుల పాలేరు తావుల వేమారు
          పిలువదగిన పేరు బెంగుళూరు

వింత నగనాణెముల నారు బెంగుళూరు
పెనుతెవుళులకు మందు వేర్బెంగుళూరు
తెల్లదొరలను రాగోరు బెంగుళూరు
వేనుడువులేల బంగారు బెంగుళూరు                  
               

Thursday, May 2, 2013

రుక్మిణి సౌందర్య వర్ణన – సీస పద్యం సొగసు


నారాయణ దాసు గారికి సీస పద్య వృత్తం అంటే ప్రత్యేక అభిమానం. ఎందుకంటే భాషా సౌందర్యానికి, భావ వ్యక్తీకరణకి ‘సీసం’ చక్కని వాహిక. దిగంతమే ప్రతిభకి హద్దు అయిన సంగీత సాహిత్య సార్వభౌముడే అల్లిన సీస పద్య సౌలభ్యం గురించి ఇక చెప్పేదేముంది? రుక్మిణి కళ్యాణం హరికథలోని ఈ సీస పద్య సౌందర్యాన్ని ఆస్వాదించండి!

దుర్వాంకురంములతో సన్నజాజులు
          మొగలిరేకులు జారుసిగను జుట్టి 
తళుకుజెక్కుగులాబిదంతము నిగనిగ
          రవలకమ్మలజోడు జెవులబెట్టి   
లేతప్రాయపు బిగిచేతిగాజులు, రైక
          యొడ్డాణమున్వెలియుడుపుగట్టి
ముద్దుమొగంబున ముత్తయిదుచిన్నెల
          నంబపేరిట నోగిరంబు వట్టి

వెన్నెలలు చీకటులు బర్వు కన్నుదోయి
ముత్తెముల్కెంపులొల్కెడి ముద్దువాయి
నందమగు రుక్మిణికన్య యలరు హాయి
చాటిజెప్పగ వేయినోళ్ళు చాలవోయి

Tuesday, April 30, 2013

గణిత శాస్త్ర ఉపమానాలతో భగవంతుని పరిచయం


శాస్త్ర విజ్ఞానం తుదిమెట్టు వేదాంతమే. అందుకే ఏ శాస్త్రంలోనైనా (కళలోలైనా) అత్యున్నత అర్హతగా డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పిహెచ్. డి.) పట్టా ఇస్తారు.  ఈ పద్యంలో దాసు గారు గణిత సంకేతాలను ఉపమానంగావాడి భగవంతుని (వేదాంత) తత్వాన్ని సులభంగా బోధపరిచారు. ఇది వారి సృజనాత్మతకి అత్యున్నత ఉపమానం.

వలయరేఖకుబోలి వశమె తెల్పంగ నీ
          కాది మధ్యాంతము లప్రమేయ
ఎల్లజగంబుల కీవె యాధారము  
          లెక్కల కన్నింటి కొక్కటి వలె
ధర్మము వైపె ఎంతయు జోగుచుందువు
          బలువువంకన్ త్రాసు ములు విధమున
పెరుగవు తరుగవు విభజింపబడవు శూ
          న్యాంకమువలె నకలంక చరిత!

పిన్నకున్ బిన్న పెద్దకున్ బెద్దవీవు
కొలత కందవు నిన్నెన్న నలవికాదు
చెలగు సరిబేసియై నీవు తలచినంత
భక్తమందార! భవదూర పరమపురుష

(యధార్థ రామాయణము. పు. ౧౩౭)

నారాయణ దాసు గారి కవితా విమర్శ


నారాయణ దాసు గారు వారి కాలంలో కనపడిన కృతకమైన కవితా ధోరణులను ఇలా దుయ్యబట్టేరు:

పూర్వప్రబంధము పోల్కికై చచ్చిన
          యీగనంటిన్చెడు హీనుడొకడు
ప్రౌకల్పనలని పన్ని తనకుదానె
          యర్ధంబెరుగలేని వ్యర్దుడొకడు
కృతిని నిఘంటువు వెతకి ముదురు తాటి
          ముంజెవలెన్ జేయు మూర్ఖుడొకడు
తేట తెల్లంబని తెన్గుబాసకు బట్ట
          తెరచి చూపించెడి దేబె యొకడు

కలివశంబున శారద కలుషయయ్యె
బిదపకాలంబున దలంపు పిచ్చియయ్యె
అచ్చుచవకయ్యె మూఢులు మెచ్చుటయ్యె
ఆహహా! ఎందుకు కవులైరి యాధునికులు?

అయితే అయన దృష్టిలో కవితాదార ఎలా ఉండాలి?

సాగి కమ్మెచ్చునన్ వచ్చు తీగకరణి
సాలెపురుగు కడుపులోని నూలువలెను
దబ్బునన్ బొర్లిపడు గొండధారమాడ్కి
సహజకవిత బయల్వెడి సన్నుతిగను