"శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాస కథా గాన కళా పరిషత్" శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసుగారి 152వ జయంతి ఉత్సవాలను స్థానిక బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఆగస్టు 28, 29, 30 తేదీలలో మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి దేవస్థాన కార్యనిర్వాహక సంఘ కార్యదర్శి శ్రీ మస్తానయ్య స్వాగతం పలికారు.
మొదటిరోజు కార్యక్రమంలో శ్రీ నారాయణ దాసు గారు రచించిన "రుక్మిణి కళ్యాణం" హరికథను శ్రీమతి నేమాని నాగలక్ష్మి భాగవతారిణి గానం చేసి శ్రోతలను రంజింపచేసారు. ఆమెకు శ్రీ యమ్. నగధర రావు మృదంగంపైనా, శ్రీ పాలేటి గోవర్ధన రావు వయోలిన్ పైనా సహకార వాద్యం అందించారు. శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాస కథా గాన కళా పరిషత్ కార్యనిర్వహకసంఘ సభ్యురాలు డా. ఉపాధ్యాయుల రాజ రాజేశ్వరి దేవి హరికథా కళాకారిణిని పరిచయం చేసారు. ఈ సభలో పరిషత్ శ్రీమతి నాగలక్ష్మికి సన్మానం చేసి "హరికథా గానామృత వర్షిణి" అనే బిరుదు ప్రదానం చేసింది.